వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటి న్యూస్): ‘వి బి జి రాంజీ’ పథకాన్ని రద్దు చేసి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్గొండ కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు కొత్త జీవోలు తెస్తున్నారని విమర్శించారు. రెండు పూటలా ఫోటోలు తీసే విధానాన్ని, ఈ-కేవైసీని తక్షణమే రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వమే పథకానికి 90 శాతం నిధులు కేటాయించాలని స్పష్టం చేశారు.కూలీలకు సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి, రోజువారీ కూలి ₹800కి పెంచాలని, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో త్రాగునీరు, నీడ, ఉచిత వైద్యం, బీమా సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు ₹20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, పట్టణ పేదలకు కూడా ఉపాధి కల్పించాలని కోరుతూ అనంతరం కలెక్టర్కు మెమొరండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన వెంకులు, మహిళా కన్వీనర్ సరోజ తదితరులు పాల్గొన్నారు.

