పాత్రికేయులకు అండగా గోళ్ళ రాజేష్
నంద్యాల, మే 6 (డిగ్నిటి న్యూస్): నిత్యం ప్రజా సమస్యలపై కలం పట్టి పోరాడే జర్నలిస్టుల కష్టాలను గుర్తించి వారికి ఆర్థిక భరోసా కల్పించడం అభినందనీయమని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మధుబాబు, యోగా గురువు ఖండే ఆనంద్ గురూజీ పేర్కొన్నారు. బుధవారం నంద్యాలలో సామాజిక సేవకుడు గోళ్ళ రాజేష్ ఆధ్వర్యంలో ‘చైతన్య జ్యోతి’ పథకం రెండో విడత కింద ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు రూ. 1.84 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా, జర్నలిస్టుల ఇబ్బందులను గమనించి రాజేష్ ముందుకు రావడం స్ఫూర్తిదాయకమని వక్తలు కొనియాడారు. కేవలం ఒక్క రూపాయికే భోజనం అందిస్తూ పేదల ఆకలి తీరుస్తున్న రాజేష్, కులమతాలకు అతీతంగా అందిస్తున్న సేవలు ఆయనను ‘ఆపద్బాంధవుడి’గా నిలబెట్టాయని ప్రశంసించారు. మీడియా మిత్రులు కూడా ఆయన సేవా కార్యక్రమాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాజ్ కుమార్ రెడ్డి, ఉస్మాన్ బాషా, మహబూబ్ బాషా, నూర్ బాషా తదితరులు పాల్గొన్నారు.
