బనగానపల్లె, మే 19 (డిగ్నిటి న్యూస్): చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ సాధ్యమవుతుందని బనగానపల్లె మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి అన్నారు. పట్టణంలోని కరీంబాగ్లోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు.ఇల్లూరు కొత్తపేట జెడ్పీ హైస్కూల్కు చెందిన యెగిలిశెట్టి సాయి చేతన్ 600కు గాను 590 మార్కులు సాధించి నియోజకవర్గ స్థాయిలో ప్రథమ ర్యాంకు పొందడంతో రూ.50 వేల నగదు బహుమతి, మెమెంటో అందించి సత్కరించారు. అలాగే నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రథమ ర్యాంకు సాధించిన 56 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున నగదు పురస్కారాలు అందజేశారు.ఈ సందర్భంగా బిసి రాజారెడ్డి మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు కీ.శే. బిసి గుర్రెడ్డి, బిసి లక్ష్మమ్మ దంపతుల జ్ఞాపకార్థం 2021-22 నుంచి ఈ ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. సెల్ఫోన్లకు దూరంగా ఉండి ఏకాగ్రతతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు.మానసిక వికాస నిపుణులు ఇనయతుల్లా మాట్లాడుతూ గ్రామీణ పేద విద్యార్థులకు ప్రోత్సాహం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్ఎం పక్కిరారెడ్డి, మధుసూదన్రెడ్డి, అల్తాఫ్ హుస్సేన్, మహబూబ్బాషా తదితరులు పాల్గొన్నారు.

