బెస్ట్ అవైలబుల్ స్కీంలో దళిత విద్యార్థులకు మరిన్ని సీట్లు కేటాయించాలి

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటీ న్యూస్): బెస్ట్ అవైలబుల్ స్కీం కింద దళిత విద్యార్థులకు ప్రముఖ ప్రైవేట్ పాఠశాలల్లో మరిన్ని సీట్లు కేటాయించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ, ప్రస్తుతం పరిమిత పాఠశాలలకే స్కీం పరిమితమవుతోందని తెలిపారు. గతంలో సెయింట్ ఆల్ఫోన్సస్, లిటిల్ ఫ్లవర్ వంటి పాఠశాలల్లో సీట్లు కేటాయించేవారని గుర్తు చేశారు. ఎస్పిఆర్, ఎంవిఆర్, ఏకలవ్య, నారాయణ, శ్రీ చైతన్య, గౌతమ్ మోడల్, ఓక్ ట్రీ తదితర ప్రముఖ పాఠశాలల్లో కూడా బీఏఎస్ స్కీం అమలు చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి దళిత విద్యార్థులకు తగిన సంఖ్యలో సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరుషరాములు, గాదె నరసింహ, బొల్లు రవీందర్, మాతంగి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Translate »