నంద్యాల, మే 25 (డిగ్నిటి న్యూస్): గాజులపల్లి–చలమ రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు ఢీకొని ఆడ పెద్దపులి మృతి చెందింది. శనివారం రాత్రి చైనేజ్ 234/2-3 కి.మీ వద్ద ఘటన చోటుచేసుకోగా సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకుని తనిఖీ నిర్వహించారు. మృతి చెందిన పులి సుమారు ఐదేళ్ల వయస్సు గల ఆడ పులిగా గుర్తించారు. ఆదివారం నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు అధికారులు, వైద్య బృందం ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. ఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు చలమ ఎఫ్ఆర్వో డి. నాగభూషణం తెలిపారు. కార్యక్రమంలో అటవీ, ఆర్పీఎఫ్ అధికారులు, వన సంరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు.






