ఆరోగ్యంపై అవగాహన ఉండాలి: ఆయుష్ వైద్యాధికారి శ్రీనివాస్

రాజుపాలెం, మే 4 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్యంపై కనీస అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఆర్. శ్రీనివాస్ సూచించారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సోమవారం ప్రాంతీయ ఉపాసంచాలకులు డాక్టర్ పి. జగదీష్ ఆదేశాల మేరకు వైద్య శిబిరం, అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంపీడీవో బి. శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ కాంచన పాల్గొని వేసవి జాగ్రత్తలపై సిబ్బందికి, ప్రజలకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. ఎండ తీవ్రత దృష్ట్యా వృద్ధులు, గర్భిణులు, పిల్లలు వడదెబ్బకు గురికాకుండా ప్రతిరోజూ 3 నుంచి 4 లీటర్ల నీటితో పాటు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవాలని కోరారు. ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ అత్యవసరమైతే తప్ప ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం ఉత్తమమని, ఎండలో వెళ్లేవారు గొడుగు, టోపీ, కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా పుచ్చకాయ, దోసకాయ వంటి ఆహారం తీసుకోవాలని, నిమ్మరసం, రాగిజావ వంటి పానీయాలు మేలు చేస్తాయని వివరించారు. అనంతరం ఎంపీడీవో చేతుల మీదుగా రోగులకు ఆయుష్ మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ముక్కంటి, శ్యామ్, వెంకటేశ్వర్లు, ఆయుష్ సిబ్బంది జిలానీ తదితరులు పాల్గొన్నారు.

Translate »