నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో తనిఖీల హడావుడి..

వసతుల లేమితో ప్రయాణికుల ఇబ్బందులు

ఈడీ పర్యటనలో రికార్డుల పరిశీలన..

కంపు కొడుతున్న మూత్రశాలలను పట్టించుకోని వైనం

​నంద్యాల, మే 19 (డిగ్నిటి న్యూస్): నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) ఎస్.టి.పి. రాఘవకుమార్ తనిఖీల పర్యటన మంగళవారం హడావుడిగా సాగింది. డిపోలోని రికార్డు రూములు, డిస్పెన్సరీ, కార్గో విభాగాలను పరిశీలించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. అయితే, అధికారులు కార్యాలయాల తనిఖీల్లో బిజీగా ఉన్న సమయంలో.. బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు మాత్రం కనీస వసతులు లేక ఇబ్బందులు పడ్డారు.

​దుర్వాసనతో ప్రయాణికుల అల్లాటప్పా:

ముఖ్యంగా బస్టాండ్‌లోని మూత్రశాలల నిర్వహణ అధ్వాన్నంగా తయారైంది. అక్కడి నుండి వస్తున్న తీవ్రమైన దుర్వాసనతో ప్రయాణికులు ముక్కులు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు లోపల ఉన్న విభాగాలను తనిఖీ చేసి అభినందించారు కానీ, నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఉపయోగించే మూత్రశాలల పరిశుభ్రతను మాత్రం పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

దాతల సాయమే దిక్కు:

ఆర్టీసీ ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో డిపో యాజమాన్యం విఫలమవుతోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. శాంతిరామ్ ఆసుపత్రి వారు కుర్చీలు డొనేట్ చేయడం, సత్యసాయిబాబా సేవా ట్రస్ట్ వారు చలివేంద్రం, మజ్జిగ పంపిణీ చేయడం వల్లే ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించింది. దాతల సాయంతో నడుస్తున్న బస్టాండ్‌లో ఆర్టీసీ వారు కనీసం మూత్రశాలలనైనా శుభ్రంగా ఉంచాలని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Translate »