శ్రీశైలం, మే 26 (డిగ్నిటి న్యూస్): శ్రీశైలం – దోర్నాల ప్రధాన ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. కర్ణాటకకు చెందిన ప్రైవేటు తుఫాన్ వాహనం దోర్నాల వైపు వస్తుండగా, ఆదోని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శ్రీశైలం వైపు వెళ్తోంది. ఘాట్ రోడ్డులోని ఒక మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయిన తుఫాన్ డ్రైవర్, నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టాడు.ఈ ప్రమాద తీవ్రతకు తుఫాన్ వాహనం ముందు భాగం దెబ్బతినగా, అందులోని కొద్దిమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ బస్సులోని వారంతా క్షేమంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనతో ఘాట్ రోడ్డులో కాసేపు ట్రాఫిక్ స్తంభించగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చేరుకుని రాకపోకలను క్రమబద్ధీకరించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

