నల్గొండ, మే 13 (డిగ్నిటి న్యూస్): విద్యా రంగం బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అవగాహన సదస్సు బుధవారం నల్గొండలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో స్థానిక సంస్థల ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. విద్యావంతమైన సమాజమే రాష్ట్ర పురోభివృద్ధికి పునాది అని, పాఠశాలల అభివృద్ధిని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా ప్రమాణాల మెరుగుదలపై సర్పంచులు, కౌన్సిలర్లకు ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. విద్యా శాఖకు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు నిరంతరం పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తమ పరిధిలోని విద్యా సంస్థల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సదస్సులో మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి, డిప్యూటీ మేయర్, మార్కెట్ కమిటీ చైర్మన్, స్థానిక కార్పొరేటర్లు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి
