నేర నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 11 (డిగ్నిటీ న్యూస్): జిల్లాలో నమోదవుతున్న వివిధ నేరాలపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తూ, పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నిర్వహించిన క్రైమ్ రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లాలో దొంగతనాల నివారణకు రాత్రి పహారా విధులను ముమ్మరం చేయాలని, శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పాటించాలని సూచించారు. నేరాల ఛేదనలో కీలకమైన సీసీ కెమెరాలను ప్రజల సహకారంతో గ్రామాల్లో, కాలనీల్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయించాలన్నారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేసి సకాలంలో చార్జిషీట్లు దాఖలు చేయాలని, సీసీటీఎన్ఎస్ డేటాను ఎప్పటికప్పుడు నవీకరించాలని స్పష్టం చేశారు. పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీలు శివరాం రెడ్డి, రాజశేఖర రాజు, శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

Chinta Yadaiah,
Nalgonda Ummadi jilla prathinidi,
Dignity News T/D
