నల్గొండ, మే 26 (డిగ్నిటి న్యూస్): ఉమ్మడి నల్లగొండ జిల్లా ముస్లిం మత పెద్దలు బక్రీద్ పండుగను శాంతి, సోదరభావ వాతావరణంలో నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. త్యాగం, సేవాభావానికి ప్రతీకగా భావించే బక్రీద్ను పరస్పర గౌరవంతో జరుపుకోవాలని సూచించారు.
బక్రీద్ అంటే కేవలం ఖుర్బానీ మాత్రమే కాదని, పేదలకు సహాయం చేయడం, ఆహారం పంచుకోవడం, మానవత్వాన్ని చాటడం పండుగ అసలు సందేశమని వివరించారు. సమాజంలో శాంతి, సామరస్యాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
గోవధ పేరుతో కొన్ని ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టే చర్యలకు ఎవరూ పాల్పడవద్దని హెచ్చరించారు. దేశంలో సామరస్య వాతావరణం కొనసాగాలని, పరస్పర గౌరవమే నిజమైన దేశభక్తి అని అభిప్రాయపడ్డారు.
ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే ఇటువంటి వివాదాలకు పూర్తిగా తెరపడే అవకాశం ఉంటుందని మత పెద్దలు అభిప్రాయపడ్డారు. యువత సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే సందేశాలు, దృశ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.
బక్రీద్ పండుగను ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు, పేదలకు ఆహార పంపిణీతో శాంతియుతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు చెందిన మత పెద్దలు మౌలానా అత్తర్ సాబ్, హఫీజ్ ఖలీల్, మౌలానా మగ్దమ్ సాబ్, ముఫ్తీ సిద్ధిక్ అహ్మద్ షా సహాబ్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.
