నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 14 (డిగ్నిటి న్యూస్): నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సాగుతున్న జనాభా గణన గృహ జాబితా నమోదు ప్రక్రియకు ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ బడుగుల చంద్రశేఖర్ కోరారు. గురువారం నాడు మేయర్, కలెక్టర్, జిల్లా న్యాయమూర్తి నివాసాల్లో ఎన్యుమరేటర్లు గృహ వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగర పరిధిలో ఏర్పాటు చేసిన 349 ఎన్యుమరేషన్ బ్లాకుల ద్వారా జూన్ 9వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు.

ఇప్పటికే స్వీయ గణన పూర్తి చేసుకున్న వారు తమకు లభించిన ‘హెచ్’ అక్షరంతో కూడిన 11 అంకెల సంఖ్యను ఎన్యుమరేటర్లకు అందజేయాలని, ఒకవేళ స్వీయ గణనలో తప్పులు దొర్లితే ప్రస్తుతం ఇంటింటికీ వచ్చే సిబ్బంది ద్వారా వాటిని సరిచేసుకోవచ్చని సూచించారు. స్వీయ గణన చేయని కుటుంబాలు ఎన్యుమరేటర్లకు పూర్తి వివరాలు అందించి నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన వంటి ప్రణాళికలన్నీ ఈ గణాంకాల ఆధారంగానే రూపొందుతాయని, కావున ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
