
కర్నూలు, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ యార్డ్ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప డిమాండ్ చేశారు. కర్నూలు మార్కెట్ యార్డులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1994 నుంచి రెగ్యులర్ నియామకాలు లేకపోయినా, ఔట్సోర్సింగ్ సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తూ ప్రభుత్వానికి ఏటా రూ.700 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూరుస్తున్నారని తెలిపారు.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వీరికి మినిమమ్ టైమ్ స్కేలు అమలు చేయాల్సి ఉన్నా, కేవలం రూ.12 వేల వేతనమే ఇవ్వడం అన్యాయమని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్న ఫైలును వెంటనే క్లియర్ చేసి, ఇతర శాఖల్లో లాగే తమకూ వేతన ప్రయోజనాలు కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ‘సమాన పనికి సమాన వేతనం’ వర్తింపజేయాలని, ఎపికోస్ నుంచి మినహాయించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నేత నక్కా వెంకటరత్నం, జిల్లా నాయకులు నాగరాజు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
