వైభవంగా చౌడేశ్వరి అమ్మవారి జ్యోతుల ఉత్సవం

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు

ఆకుమల్ల పెద్దమ్మ జాతరలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

సంజామల, జూన్ 6 (డిగ్నిటి న్యూస్): మండలంలోని ఆకుమల్ల గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి చౌడేశ్వరి అమ్మవారి జ్యోతుల కార్యక్రమాన్ని భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని తళారీ జక్కులు నివాసం వద్ద నుంచి ప్రారంభమైన ఈ జ్యోతుల ప్రదర్శన మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా సాగింది. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ శోభాయాత్ర అనంతరం జ్యోతులు చౌడేశ్వరి దేవి ఆలయానికి చేరుకున్నాయి. అక్కడ అర్చకులు అమ్మవారికి ప్రత్యేకంగా ఖడ్గమాల పఠించి, శాస్త్రోక్తంగా విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ వేడుకను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో భక్తిభావం వెల్లివిరియగా, భక్తులు లైన్లలో వేచి ఉండి అమ్మవారికి బియ్యం, బేడలు, కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *