బనగానపల్లె, మే 24 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో రాత్రి వేళ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వీచిన బలమైన గాలుల ధాటికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు కూలిపోవడంతో రాత్రి నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా కోవెలకుంట్ల – గుంజలపాడు రహదారిపై వాయువేగంతో వీచిన గాలులకు అనేక పెద్ద చెట్లు వేళ్లతో సహా పెకలించుకుపోయి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. అదేవిధంగా కోవెలకుంట్ల – బనగానపల్లె ప్రథాన రహదారిలోనూ పలుచోట్ల రోడ్లపై భారీగా చెట్లు కూలిపడ్డాయి. స్థానికులు, అధికారులు రంగంలోకి దిగి రహదారులపై ఉన్న చెట్లను తొలగించేందుకు చర్యలు చేపట్టారు.మరోవైపు సంజామల మండలం ముదిగేడు గ్రామంలో ఈ గాలివాన తీవ్ర విషాదాన్ని నింపింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి, గాలుల ధాటికి స్థానిక రైస్ మిల్లు గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో గోడ పక్కనే ఆశ్రయం పొందుతున్న సుమారు 20 గొర్రెలు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనతో బాధితులకు భారీ నష్టం వాటిల్లింది. నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన ఈ అకాల వర్షం సృష్టించిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.
నంద్యాల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం: పలుచోట్ల విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, సంజామల మండలంలో రైస్ మిల్లు గోడకూలి 20 గొర్రెలు మృతి
