భువనగిరి, మే 8 (డిగ్నిటి న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లాలో పోయిన, చోరీకి గురైన 75 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి శుక్రవారం బాధితులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సుమారు రూ. 12 లక్షల విలువైన ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్న ఫోన్లను సైతం ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా ట్రేస్ చేశామని పేర్కొన్నారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు పోర్టల్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. నెలల తరబడి ఆశలు వదులుకున్న తమ ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే క్రమంలో ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత లింకులు క్లిక్ చేయవద్దని ఎస్పీ హెచ్చరించారు.
రికవరీ చేసిన 75 సెల్ ఫోన్ల అందజేత
