- పోస్టర్లను ఆవిష్కరించిన ఆర్పీఎస్, ఆర్ఈఎఫ్ నాయకులు
డిగ్నిటి న్యూస్, నంద్యాల జూన్ 25: నంద్యాల జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జులై 19న నిర్వహించనున్న ‘చలో నంద్యాల గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయభేరి’ సభ పోస్టర్లను ఆర్పీఎస్, ఆర్ఈఎఫ్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు శేషపని, రాష్ట్ర యూత్ అధ్యక్షులు పెరుగు శివకృష్ణ మాట్లాడుతూ, దేశంలో 85 శాతం ఉన్న బహుజనులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ పరిరక్షణ, న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు, చట్టసభల్లో బీసీలకు 44 శాతం కోటా, గ్రేటర్ రాయలసీమ గిరిజనులకు 5 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల కేటాయింపుతో పాటు స్థానిక పరిశ్రమల్లో బహుజనులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని, ఈ న్యాయభేరి సభను విజయవంతం చేయడానికి బహుజన ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోయ పులికొండన్న, రమేష్ యాదవ్, బి. శ్రీనివాసులు, జాల సురేష్ యాదవ్, దేవా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

