మిర్యాలగూడ, మే 5 (డిగ్నిటి న్యూస్): విలాసాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వీరు, పాఠశాల దశలోనే చదువు మానేసి మద్యం, ధూమపానం వంటి దురలవాట్లకు బానిసలయ్యారు. మొదట్లో చిన్న చిన్న వస్తువులు, నాటుకోళ్లు, సైకిళ్లు దొంగిలించి విక్రయించిన వీరు, జల్సాలకు మరింత డబ్బు అవసరం కావడంతో బైక్ చోరీల బాట పట్టారు.మిర్యాలగూడ, హుజూర్నగర్ తో పాటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని దాచేపల్లి ప్రాంతాల్లో ఈ ముఠా వరుస దొంగతనాలకు పాల్పడింది. ముఖ్యంగా మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న పల్సర్ బైక్లనే లక్ష్యంగా చేసుకుని వీరు చోరీలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 3వ తేదీ రాత్రి విద్యానగర్ ప్రాంతంలో బైక్ను దొంగిలిస్తుండగా పోలీసులు గమనించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరొకరు పరారయ్యారు. నిందితుల నుంచి సుమారు ఏడు పల్సర్ బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు. నిందితులపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో తొమ్మిది కేసులు నమోదై ఉన్నట్లు విచారణలో తేలింది.
జల్సాల కోసం దొంగతనాలు: ముగ్గురు మైనర్ల ముఠా అరెస్టు
