పేద విద్యార్థుల కోసం ఉచిత ఆంగ్ల విద్య

వీవీఎం పాఠశాల బ్రోచర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 12 (డిగ్నిటి న్యూస్): పేద విద్యార్థుల విద్యాభివృద్ధి లక్ష్యంగా నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం తన మానస పుత్రికగా రూపొందించిన ‘ఉద్దీపన వీవీఎం ఇంగ్లీష్ మీడియం’ పాఠశాల బ్రోచర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికంతో ఏ విద్యార్థీ చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ వంటి అత్యాధునిక వసతులతో కూడిన నాణ్యమైన విద్యను ఇక్కడ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం నుంచే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాలని ఉపాధ్యాయులకు సూచించిన ఆయన, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఈ పాఠశాల బాటలు వేస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Translate »