నిరంతరాయంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు.. నేడు మర్రిగూడెంలో 14వ క్యాంపు
నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 6 (డిగ్నిటి న్యూస్): మునుగోడు నియోజకవర్గంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడొద్దనే లక్ష్యంతో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలను నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మండలాల్లో 13 విడతలుగా ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ క్యాంపుల ద్వారా మొత్తం 9,766 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, 4,227 మందికి కళ్లజోళ్లను పంపిణీ చేయడంతో పాటు 2,198 మందికి విజయవంతంగా కంటి శస్త్రచికిత్సలు చేయించారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో దాదాపు 10 వేల మందికి కంటి ఆపరేషన్లు చేయించాలనే సంకల్పంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మర్రిగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో 14వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ శిబిరానికి సంబంధించిన ఏర్పాట్లను స్థానిక నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇప్పటికే గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.


Chinta Yadaiah,
Nalgonda Ummadi jilla prathinidi,
Dignity News T/D
