నంద్యాల, మే 19 (డిగ్నిటి న్యూస్): దేశ ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేసే చిన్నారుల జీవితాలను ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (సిఐఒ) రాష్ట్ర కార్యదర్శి మౌలానా గౌస్ పీర్ నిజామి పేర్కొన్నారు. స్థానిక యాంటీ కోట మసీదులో నాలుగు రోజులుగా నిర్వహించిన వేసవి శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల హృదయాలలో ప్రేమ, దేశభక్తి పెంపొందేలా పెద్దలు మసలుకోవాలన్నారు. జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల అధ్యక్షులు అబ్దుల్ సమద్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ, పిల్లలను సోషల్ మీడియా బారిన పడకుండా నియంత్రించాలని, వారి నైపుణ్యాలను ప్రోత్సహించడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.ఈ ముగింపు వేడుకల్లో 150 మందికి పైగా చిన్నారులు పాల్గొని తమ సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. అనంతరం శిక్షణలో రాణించిన పిల్లలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు, సర్టిఫికేట్లు, నగదు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐఒ కోఆర్డినేటర్లు ఫిర్దోష్ బాను, ఉజ్మా బాను, జేఐహెచ్ మహిళా విభాగం ప్రతినిధులు నాజిమ బేగం, అమ్తుస్సలాం, జమాత్ జిల్లా బాధ్యులు హాఫీజ్ షోయబ్ జమా, జకరియా, ఐటా అధ్యక్షులు ముహమ్మద్ సలీం, సయ్యద్ జమీలుద్దీన్, వరంగల్ సలీం, ఎస్ఐఒ, జిఐఓ ప్రతినిధులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

