జీపీ కార్మికుల హామీలను వెంటనే అమలు చేయాలి

జీపీ కార్మికుల హామీలను వెంటనే అమలు చేయాలి

కలెక్టరేట్‌ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా

నల్గొండ టౌన్, జూన్ 12 (డిగ్నిటి న్యూస్): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్ డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం నల్గొండ కలెక్టరేట్ ఎదుట కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన సుధాకర్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని, కనీస వేతనాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, రెండున్నర ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గత ఐదు నెలలుగా వేతనాలు అందక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం, యూనియన్ జిల్లా కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామాల్లో కార్మికుల అక్రమ తొలగింపులను ఆపాలని, అధిక పనిగంటల వేధింపులకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. జీపీ కార్మికులకు చట్టబద్ధంగా రావాల్సిన రక్షణ పరికరాలు, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తులో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించిన నాయకులు, అనంతరం అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డిపిఓ శంకర్ నాయక్‌లకు వినతిపత్రం సమర్పించారు. ఈ నిరసనలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు పొన్న అంజయ్య, చింతపల్లి బయన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *