
రాజుపాలెం, మే 07 (డిగ్నిటి న్యూస్): పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోటనెమలిపురిలో ‘స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శని – న్యూట్రి గార్డెన్’ కార్యక్రమాన్ని అధికారులు, గ్రామ పెద్దలు ప్రారంభించారు. ప్రతి ఇంట్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకుని పౌష్టికాహారం తీసుకోవాలని, పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని అధికారులు సూచించారు. మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ చిరుధాన్యాలు సేవించాలని, యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ కోరారు. గ్రామాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని గ్రామ పెద్ద సానికొమ్ము కోటారెడ్డి ప్రకటించగా, బాలికలకు క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. అంగన్వాడీల ఆధ్వర్యంలో పౌష్టికాహార స్టాళ్లు ఏర్పాటు చేయగా, ఆయుష్ విభాగం వడదెబ్బ నివారణ మందులను పంపిణీ చేసింది.
