మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి
నంద్యాల, మే 11 (డిగ్నిటి న్యూస్): ఆటోనగర్ పారిశ్రామిక ప్లాట్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఆయన జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అర్హులైన వారిని కాదని నిబంధనలకు విరుద్ధంగా తమ అనుచరులకు, అనర్హులకు స్థలాలను కట్టబెట్టారని మండిపడ్డారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ధ్వజమెత్తారు. ఈ కుంభకోణంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. అధికార బలంతో పేదలకు అన్యాయం చేయడం సరికాదని, బాధితులకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తామని ఈ సందర్భంగా బ్రహ్మానంద రెడ్డి స్పష్టం చేశారు.
