నంద్యాల, మే 18 (డిగ్నిటి న్యూస్): రాబోయే ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై నంద్యాల మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రాల సిబ్బంది, విస్తరణ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది ఖరీఫ్లో ఎల్ నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం 25 నుంచి 30 రకాల విత్తనాలతో కూడిన ప్రత్యేక కిట్లను అందించి, తొలకరి వర్షాలు పడగానే విత్తుకునేలా చూడాలన్నారు. ఈ విధానం వల్ల భూమిలో తేమ, సూక్ష్మజీవులు పెరిగి, తదుపరి పంటలకు సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడటమే కాకుండా ఎల్ నినో ప్రభావాన్ని తట్టుకోగలవని వివరించారు. అలాగే, ప్రతి గ్రామం నుండి మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలకు పంపాలని అధికారులను ఆదేశించారు. కౌలు రైతులు పంట సాగుదారు హక్కు పత్రాల (సీసీఆర్సీ) కొరకు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని, రసాయనిక ఎరువుల సమతుల్య వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రసాద్ రావు స్పష్టం చేశారు.
ఖరీఫ్ సన్నద్ధతపై వ్యవసాయ అధికారుల సమీక్ష
