ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ

ఆళ్లగడ్డ, మే 7 (డిగ్నిటి న్యూస్): పట్టణంలోని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల నిబంధనల ఉల్లంఘనపై విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి లతీఫ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారికంగా వేసవి సెలవులు ప్రకటించినప్పటికీ, కొన్ని యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని మండిపడ్డారు. సెలవుల్లో విశ్రాంతి తీసుకోవాల్సిన ఉపాధ్యాయులపై అడ్మిషన్ల పేరుతో ఒత్తిడి తీసుకురావడం దుర్మార్గమన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైవేటు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.

Translate »