- కర్నూలు, తిరుపతి సహా పలుచోట్ల సోదాలు.. రూ.4 కోట్లకు పైగా అక్రమాస్తుల గుర్తింపు
కర్నూలు, జూన్ 27 (డిగ్నిటి న్యూస్): ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే నమ్మదగిన సమాచారంతో తిరుపతి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్గా పనిచేస్తున్న యుగంధర్ ముని ప్రసాద్ ఇళ్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కర్నూలు, తిరుపతితో పాటు ఆయనకు సంబంధమున్న మరో రెండు ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తెల్లవారుజాము నుంచే విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ సోదాల్లో ప్రాథమికంగా నాలుగు కోట్లకు పైగా విలువైన అక్రమ ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న విలేఖరులకు వెల్లడించారు.ప్రస్తుతం కర్నూలు నగరంలోని ఏ క్యాంప్ పరిధిలో ఉన్న ముని నిలయం ‘జీ ప్లస్ త్రీ’ అపార్ట్మెంట్, క్లౌడ్-9 లోని ఒక ఫ్లాట్, శేఖర్ ప్రైడ్ విల్లాతో పాటు మరో నాలుగు ఇంటి ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.5.78 లక్షల నగదు, 172 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.3 కిలోల వెండి వస్తువులు, రూ.49 లక్షల విలువైన వివిధ బాండ్లు, ఒక కారు, ఒక బైక్ను అధికారులు గుర్తించారు. నిందితుడి పేరు మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ఉన్న ఒక లాకర్ను ఇంకా తెరవాల్సి ఉందని, ఆ లాకర్ సోదాల అనంతరం పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.

