పేదింటి ఆడబిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మి

నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 14 (డిగ్నిటీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 64 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఆడబిడ్డ వివాహానికి ప్రభుత్వం రూ. 1,00,116 ఆర్థిక సాయం అందిస్తోందని, దీనివల్ల తల్లిదండ్రులకు పెళ్లి భారం తప్పుతుందని హర్షం వ్యక్తం చేశారు. దళారుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సాయం అందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ, ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Translate »