మహిళా డిగ్రీ కళాశాలలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ఆవిష్కరణ

నల్గొండ, మే 11 (డిగ్నిటి న్యూస్): నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్)లో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. శ్రీనివాస రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఏడు రోజుల విద్యా ప్రణాళికను (7 Days Education Week Plan), ప్రత్యేక బ్రోచర్ మరియు ఫ్లెక్సీలను అతిథులు ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, వార్డు కార్పొరేటర్ అబ్బగోని కవిత విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేశారు.విద్యార్థినుల నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా వివిధ సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్, పరిశ్రమలతో ఈ సందర్భంగా కీలక అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకున్నారు. విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా విద్యార్థినులను సమర్థవంతమైన నాయకులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Translate »