నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

జిల్లా కలెక్టర్ బడుగుల చంద్రశేఖర్

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 11 (డిగ్నిటి న్యూస్): నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, ప్రతి వర్షపు నీటి చుక్కను సంరక్షించుకోవాలని అన్నారు. “జల్ సంచయ్ జన బాగిదారి” కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణ చర్యలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రచార రథాన్ని సోమవారం అయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జండా ఊపి ప్రారంభించారు.అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జల సంరక్షణపై ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రజలలో ఈ విషయమై అవగాహన కల్పించేందుకు గాను ఏర్పాటు చేసిన ప్రచార వాహనం జిల్లాలోని అన్ని గ్రామాలను సందర్శిస్తుందని, తెలంగాణ సాంస్కృతి సారధి కళాకారుల ద్వారా నీటి సంరక్షణ, నీటి పొదుపు ,ఉన్న నీటి వనరులను ఎలా వినియోగించుకోవాలో వాటికి సంబంధించిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం తో పాటు,నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా కమ్యూనిటీ సోక్ పిట్లు, వ్యక్తిగత సోక్ పిట్లు, నీటిని వృద్ధిపరిచేందుకు తోడ్పడే ఫామ్ పాండ్స్ ,నీటి సంరక్షణ కట్టడాలపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు.

జిల్లాలోని ప్రజలందరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని, నీటి వనరులను సంరక్షించుకోవాలని, నీటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని, నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములై సహకరించాలని కోరారు.నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వర్షపు నీటిని సంరక్షించుకోవడం చాలా ముఖ్యమని, నీటిని పొదుపుగా వాడుకుంటే వచ్చే తరాల వారికి నీటి కొరత లేకుండా చూడవచ్చని, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని, భావితరాలను దృష్టిలో ఉంచుకొని నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇల్లు నిర్మించుకునే వారికి తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకునేలా చూస్తామని, నీటి సంరక్షణ చర్యలపై కార్పొరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు,స్థానిక కార్పొరేటర్ వున్న జ్ఞానేశ్వరి,కలెక్టర్ కార్యాలయ ఏ ఓ మోతిలాల్, డిఆర్డిఏ సిబ్బంది, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

Translate »