వక్ఫ్ భూముల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల, మే 10 (డిగ్నిటి న్యూస్): కర్నూలు పట్టణంలోని వివాదాస్పద ఈద్గా స్థలంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చారిత్రాత్మకమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. సుమారు 300 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు చెందుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడం ముస్లిం మైనార్టీల విజయమని ఆయన అన్నారు. ఆదివారం నంద్యాలలోని మంత్రి నివాసంలో జమాతే అహలే సున్నత్ ప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈద్గాకు చెందిన భూములను అక్రమంగా దక్కించుకోవాలని చూశారని, అయితే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించి విజయం సాధించిందని వివరించారు. వక్ఫ్ ఆస్తులను కాపాడే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని, ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ భూమిని మైనార్టీల సంక్షేమం, మతపరమైన కార్యక్రమాలకే వినియోగిస్తామని హామీ ఇచ్చారు. కేసు విజయంలో మంత్రి కృషిని కొనియాడుతూ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉర్డూ అకాడమీ చైర్మన్ ఫరూక్ హుబ్లీ, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ తదితరులు పాల్గొన్నారు.

Translate »