RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

బుడగజంగాల సంక్షేమానికి సీఎం పెద్దపీట: తాటికొండ బుగ్గ రాముడు హర్షం

నంద్యాల, మే 8 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): రాష్ట్రంలోని బుడగజంగాల సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల బేడ బుడగ జంగాల రాష్ట్ర అధికార ప్రతినిధి తాటికొండ బుగ్గ రాముడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. బుడగజంగాలను ఎస్సీల్లో చేర్చే విషయంపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని హామీ ఇవ్వడమే కాకుండా, కేంద్రం ఆమోదం వచ్చేలోపే ఉద్యోగ నియామకాలు మినహా మిగిలిన అన్ని ఎస్సీ సంక్షేమ ఫలాలను ఈ వర్గానికి తక్షణమే వర్తింపజేయాలని ఆదేశించడం పట్ల బుగ్గ రాముడు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తాటికొండ బుగ్గ రాముడు మాట్లాడుతూ, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న తమ సామాజిక వర్గ సమస్యపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం చారిత్రాత్మకమని కొనియాడారు. ఎస్సీ జాబితాలో చేర్చే ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగానే, మరోవైపు ఈ వర్గ ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగేలా ఇతర పథకాలను అమలు చేయాలని ఆదేశించడం చంద్రబాబు నాయుడుకు బుడగజంగాల పట్ల ఉన్న చిత్తశుద్ధిని, వారి అభివృద్ధిపై ఉన్న ఆకాంక్షను చాటిచెబుతోందని ఆయన పేర్కొన్నారు.సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బుడగజంగాల జీవితాల్లో ఈ నిర్ణయం పెను మార్పులు తీసుకువస్తుందని, వారి ఇళ్లల్లో వెలుగులు నింపుతుందని బుగ్గ రాముడు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యమైన సామాజిక న్యాయం దిశగా కూటమి ప్రభుత్వం వేసిన ఈ అడుగును బుడగజంగాల సంఘం తరపున తాము సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించడం తమ వర్గానికి పెద్ద భరోసాను ఇచ్చిందని బుగ్గ రాముడు వెల్లడించారు.

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully