నంద్యాల, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): అనంతపురంలో జర్నలిస్టుపై సాగిన దౌర్జన్యాన్ని నిరసిస్తూ పాత్రికేయ లోకం కదం తొక్కింది. గీతం జూనియర్ కళాశాల చైర్మన్ మనీషా నాయర్ సాగించిన అరాచకానికి వ్యతిరేకంగా జిల్లాలోని విలేకరులందరూ యూనియన్లకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి తమ సత్తా చాటారు. ప్రెస్ క్లబ్ దగ్గరికి వచ్చిన ఆమెను, ఆమె అనుచరులను విలేకరులు ఐకమత్యంతో నిలదీసి అక్కడి నుంచి తరిమికొట్టిన తీరు మీడియా శక్తికి నిదర్శనంగా నిలిచింది. ఒక విలేకరి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ, ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల ముందు అవమానించడం పట్ల పాత్రికేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నంద్యాల ప్రతినిధులు సి.ఎం. నాగేంద్ర, రామన్న, హనుమతులు స్పందిస్తూ.. జర్నలిస్టులకు కష్టం వచ్చినప్పుడు విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడితేనే వృత్తికి గౌరవం దక్కుతుందని స్పష్టం చేశారు. అనంతపురంలో విలేకరులు ప్రదర్శించిన ఐక్యత ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, యూనియన్ల పేరుతో విడిపోతే భవిష్యత్తులో ఇలాంటి శక్తులు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మీడియా ప్రతినిధులపై దాడులు జరిగితే చూస్తూ ఊరుకోబోమని, సమిష్టి పోరాటాల ద్వారానే అరాచక శక్తులకు బుద్ధి చెప్పగలమని ఈ ఘటన నిరూపించిందన్నారు. ఇప్పటికైనా పాత్రికేయ లోకమంతా ఏకమై జర్నలిస్టుల భద్రత కోసం గొంతెత్తాలని, ఆనాడు చిత్తూరులో జరిగిన ఘోరం మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఐకమత్యమే ఏకైక మార్గమని వారు పిలుపునిచ్చారు.
అరాచకంపై అక్షరాయుధాల గర్జన..అనంతపురంలో మీడియా పవర్..!
