- విద్యార్థుల పోరాటాలను అణచివేయడం ప్రజాస్వామ్యంపై దాడే..
- ప్రజాసంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం
నంద్యాల, జూలై 24 (Dignity News): విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయమని, ఇది ప్రజాస్వామ్య హక్కులను, రాజ్యాంగాన్ని పూర్తిగా కాలరాయడమేనని ప్రజాసంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాల పిలుపుమేరకు నేడు నిర్వహించిన విద్యాసంస్థల బంద్ నేపథ్యంలో తెల్లవారుజామున 4 గంటలకే పీడీఎస్యూ (PDSU) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు S.M.D. రఫీని నంద్యాల త్రీటౌన్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు.ఈ సందర్భంగా అరెస్ట్ అయిన PDSU రాష్ట్ర అధ్యక్షుడు రఫీ మాట్లాడుతూ.. విద్యార్థుల పక్షాన పోరాడుతున్న నాయకులను తెల్లవారుజామున అరెస్టు చేయడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. విద్యార్థి నేతలను చూసి భయపడి ముందస్తు అరెస్టులు చేసే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందని, ఇటువంటి సిగ్గుమాలిన చర్యలకు పాల్పడుతున్న పాలకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్రంగా హెచ్చరించారు.బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సీనియర్ సిటిజన్, ఆవాజ్ నాయకులు ఎస్.మస్తాన్ వలీతో పాటు పలువురు ప్రజాసంఘాల నాయకులు విమర్శలు గుప్పించారు. నీట్ (NEET) పేపర్ లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలని, ఈ ఘోరానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ లీకేజీపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద లక్షలాది మంది విద్యార్థులు, యువకులు పోరాడుతుంటే, వారికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నప్పటికీ మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దారుణమన్నారు. బంద్ను విఫలం చేసేందుకు ప్రభుత్వం పోలీసు బలగాలతో అణచివేత చర్యలకు దిగడం హేయమైన చర్య అని, అరెస్టు చేసిన PDSU రాష్ట్ర అధ్యక్షుడు రఫీని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నేటి విద్యాసంస్థల బంద్కు స్వచ్ఛందంగా విద్యాసంస్థలు, ప్రజలు, విద్యార్థులు సంపూర్ణ మద్దతు తెలిపి జయప్రదం చేసినట్లు ప్రజాసంఘాల నాయకులు వెల్లడించారు.

