- రొమ్ము క్యాన్సర్ నూతన చికిత్సా విధానాలపై అవగాహన
నంద్యాల, జూలై 19 (డిగ్నిటి న్యూస్): నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో కర్నూలు కామినేని జెమ్ కేర్ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త నిర్వహణలో స్థానిక ఒక హోటల్ సమావేశ భవనంలో నంద్యాల ప్రాంత వైద్యులకు నిరంతర వైద్య విద్యా సదస్సు నిర్వహించారు. ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా ముఖ్య వక్తలుగా హాజరైన కర్నూలు కామినేని జెమ్ కేర్ ఆసుపత్రి క్యాన్సర్ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ కొల్లా మోహన్ రెడ్డి రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో నూతన విధానాలపై, క్యాన్సర్ రేడియేషన్ నిపుణులు డాక్టర్ సమీర్ హుస్సేన్ రొమ్ము క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ పాత్ర అనే అంశంపై మల్టీమీడియా ప్రజెంటేషన్ ద్వారా వైద్యులకు సమగ్ర అవగాహన కల్పించారు.అనంతరం డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ వైద్యులు నిరంతరం తమ వైద్య పరిజ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారానే ప్రజలకు ఆధునిక, మెరుగైన సేవలు అందించగలరని, అందుకోసమే ఇటువంటి నిరంతర వైద్య విద్యా సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి, సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు, కామినేని జెమ్ కేర్ ఆసుపత్రి సీఈవో డాక్టర్ చంద్రశేఖర్, ముఖ్య పరిపాలన అధికారి షేక్షావలి, డీజీఎం రంజిత్ కుమార్, మేనేజర్ జకారియాతో పాటు నంద్యాల ప్రాంతానికి చెందిన అధిక సంఖ్యలో వైద్యులు పాల్గొన్నారు.

