- పుస్తకాలు విక్రయిస్తున్న స్కూళ్లలో ఏబీవీపీ ఆందోళన
- స్పందించకుంటే డీఈఓ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరిక
నంద్యాల, జూన్ 24 (డిగ్నిటి న్యూస్): ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను వెంటనే సీజ్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు డిమాండ్ చేశారు. ఏబీవీపీ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అక్రమంగా విక్రయిస్తున్న పుస్తకాలను విద్యార్థి నాయకులు అడ్డుకుని సీజ్ చేయించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కర్నూల్ విభాగ్ కన్వీనర్ యుగంధర్ మాట్లాడుతూ.. ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి విద్యా మాఫియాగా మారుతున్నాయని, తలిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని మండిపడ్డారు. కేవలం ఫీజులతోనే సరిపెట్టకుండా పుస్తకాలు, టై, షూల పేరుతో అదనపు భారాన్ని మోపుతున్నా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు.రాష్ట్ర, జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నంద్యాల జిల్లా కన్వీనర్ లక్ష్మీనరసింహ, నగర కార్యదర్శి మనీష్ నాయుడు, నాయకులు పార్థసారథి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

