సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 10 (డిగ్నిటి న్యూస్): నల్లగొండ జిల్లా అభివృద్ధి పనులపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో కలిసి బుధవారం ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి, ప్రస్తుత ధాన్యం సేకరణ తదితర కీలక అంశాలపై అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నార్కెట్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించి, పనులను వెంటనే ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, నల్లగొండ జిల్లాను అన్ని రంగాలలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, మున్సిపల్, నీటిపారుదల, రహదారుల శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Chinta Yadaiah,
Nalgonda Ummadi jilla prathinidi,
Dignity News T/D
