వేగం కాదు.. ప్రాణాలతో చేరడమే ముఖ్యం

వెలిమినేడు గ్రామ సభలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన డీజీపీ, ఎస్పీ

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 10 (డిగ్నిటి న్యూస్): ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చిట్యాల మండలం వెలిమినేడులో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామ సభకు ముఖ్య అతిథులుగా హాజరైన టెక్నికల్ సర్వీసెస్ డీజీపీ వి.వి. శ్రీనివాస్ రావు, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొని ప్రసంగించారు.

డీజీపీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అధిక వేగం, హెల్మెట్ లేకపోవడం వల్లే 90 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని, వేగం కంటే ప్రాణాలతో గమ్యం చేరడమే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన మొదటి గంట ‘గోల్డెన్ అవర్’ అని, ఆ సమయంలో బాధితులను ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడవచ్చని, ప్రభుత్వం రూ.1.50 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. నిరంతర నిఘా, లోపాల సవరణ వల్ల వెలిమినేడు పరిధిలో ఏటా ప్రమాదాల మరణాలు తగ్గుముఖం పట్టాయని, ప్రతి ఒక్కరూ డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎవరూ హెల్మెట్ లేకుండా వాహనాలు నడపబోమని సర్పంచ్ చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు తీర్మానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్షా శిబిరంలో బాధితులకు డీజీపీ, ఎస్పీ చేతుల మీదుగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి, జడ్పీ సీఈఓ ప్రేమ్ కరుణ్ రెడ్డి, పోలీస్ అధికారులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *