నగరాభివృద్ధికి ప్రజల సూచనలే మార్గదర్శకం: మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 10 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” ప్రత్యేక వార్డు సభల కార్యక్రమం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విజయవంతంగా ముగిసింది. మొత్తం నాలుగు విడతలుగా సాగిన ఈ సభలలో భాగంగా.. చివరి రోజు 11, 31, 32, 33, 34, 35, 36, 37, 41, 43, 47, 48 డివిజన్లలో ప్రత్యేక సభలు నిర్వహించారు. ఈ ముగింపు సభల్లో ప్రజలు, కార్పొరేటర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర మాట్లాడుతూ.. వార్డు సభల ద్వారా నగర ప్రజల సమస్యలు, అవసరాలు, సూచనలను నేరుగా తెలుసుకునే అవకాశం లభించిందన్నారు. సభల్లో భాగంగా చెత్త సేకరణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్-2026), వర్షపు నీటి సంరక్షణ, డ్రైనేజీల నిర్వహణ, పారిశుధ్యం, హరితహారం వంటి కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. అలాగే స్థానిక సమస్యలపై ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశామన్నారు. మొత్తం 48 డివిజన్లలో ఈ సభలను విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, సిబ్బంది, నగర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలను భవిష్యత్ నగరాభివృద్ధి ప్రణాళికల్లో పొందుపరిచి, మెరుగైన పౌర సేవలు అందిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.

Chinta Yadaiah,
Nalgonda Ummadi jilla prathinidi,
Dignity News T/D
