అభిషేకాలు, సర్పసూక్త హోమాలతో కిక్కిరిసిన సేవా క్షేత్రం.. భక్తుల భారీ సందడి
S. కొత్తూరు/పాణ్యం, జూన్ 7 (డిగ్నిటి న్యూస్): మండల కేంద్రమైన పాణ్యంలోని సేవా క్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయ ప్రధాన అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం, ఈరోజు స్వామివారికి ఎంతో భక్తిశ్రద్ధలతో విశేష అభిషేకాలు, సర్పసూక్తం, మహానివేదన, మరియు మహా మంగళహారతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుండి దాదాపు ఐదు వేల నుండి పది వేల మంది వరకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు.ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు పెద్ద ఎత్తున అభిషేకాలు నిర్వహించగా, దాదాపు నాలుగు వందల వరకు అభిషేక పూజలు జరిగినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు భారీగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.అదేవిధంగా ప్రతి వారం వచ్చే మంగళవారం రాహుకాలం సమయంలో ఆలయంలో ప్రత్యేకంగా కాలసర్పదోష పూజలు, శాంతులు నిర్వహిస్తారని ప్రధాన అర్చకులు పేర్కొన్నారు. వివాహం ఆలస్యమవుతున్న వారు, సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు, అలాగే ఆరోగ్య, ఉద్యోగ రీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు మంగళవారం రోజున స్వామివారికి క్షిరాభిషేకం (పాలాభిషేకం) చేయించి, ప్రదక్షిణలు చేస్తే అనుకున్న పనులు నూటికి నూరు శాతం నెరవేరుతాయని ఆయన భక్తులకు తెలియజేశారు.

