నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 6 (డిగ్నిటి న్యూస్): నల్లగొండ జిల్లా కనగల్ మండలం చెర్లగౌరారం గ్రామంలో జిల్లా పోలీస్ శాఖ, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాల పంచాయతీ’ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీజీపీఏ డైరెక్టర్ అభిలాషా బిష్త్, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలల్లో మౌలిక వసతులు, పరిశుభ్రత, బాలల భద్రత, గ్రామాభివృద్ధి వంటి పలు సమస్యలపై తమ అభిప్రాయాలను అధికారుల ముందు ధైర్యంగా వ్యక్తపరిచారు. అతిథులు మాట్లాడుతూ పిల్లల రక్షణ కుటుంబం నుంచే ప్రారంభమవుతుందని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ఆలోచనలను ప్రోత్సహించాలని సూచించారు.

గ్రామస్థాయి నుంచే పిల్లలకు ప్రజాస్వామ్యంపై అవగాహన కల్పించి, వారిని భాగస్వాములను చేయడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు. బాలల భద్రత, విద్య, మానసిక అభివృద్ధి కోసం జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఎస్పీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో యంగిస్థాన్, ఆశ్రిత ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొని బాలల హక్కులు, సురక్షిత బాల్యంపై చిన్నారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాం రెడ్డి, ఎంపీడీఓ వేద రక్షిత, సీఐలు, ఎస్ఐలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.


Chinta Yadaiah,
Nalgonda Ummadi jilla prathinidi,
Dignity News T/D
