సూర్యాపేటలో యువకుడి జీవితాన్ని ఛిద్రమం చేసిన రోడ్డు ప్రమాదం
సూర్యాపేట, జూన్ 6 (డిగ్నిటి న్యూస్): సూర్యాపేట పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గాంధీనగర్ ప్రాంతంలోని జనగామ – సూర్యాపేట ప్రధాన రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఎస్.కె. అక్బర్ పాషా అనే యువకుడు రహదారిపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్బర్ పాషా కుడికాలు తీవ్రంగా దెబ్బతిని తెగిపోయినట్లు సమాచారం. వెంటనే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.
అక్బర్ పాషా హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తన కుటుంబానికి ప్రధాన ఆర్థిక ఆధారంగా ఉన్నాడని గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రమాదంతో కుటుంబం తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందుల్లోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుమారుడి ఆదాయంపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబం ప్రస్తుతం ఆందోళనలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ప్రమాదానికి కారణమైన యువకులు మద్యం మత్తులో రాంగ్రూట్లో వాహనం నడిపినట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై అధికారికంగా పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. మరోవైపు, ప్రభావశీలుల కుటుంబాలకు చెందిన వ్యక్తులు కావడంతో కేసులో నిందితులను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
స్థానిక ప్రజలు, బాధిత కుటుంబ సభ్యులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి అంశాలపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు, పోలీసుల అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.


Chirraboina Rama Rao Yadav,
Dignity News Cheaf Editor,
AP/Telangana
