”ఒకటో తేదీ జీతాలు” హామీ ఏమైంది..?

సర్పంచులు, అంగన్వాడీల్లో ఆందోళన

హైదరాబాద్, జూన్ 5 (డిగ్నిటి న్యూస్): ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన హామీ అమలుపై ఇప్పుడు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచులు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన “ఒకటో తేదీకే జీతాలు” హామీ కేవలం ప్రకటనలకే పరిమితమైందా అనే చర్చ ఉద్యోగ వర్గాల్లో మొదలైంది.రాష్ట్రంలోని 12,762 గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు గత ఏడాది డిసెంబర్ 22న పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌరవ వేతనాల చెల్లింపులో జాప్యం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో సర్పంచికి నెలకు రూ.6,500 చొప్పున చెల్లించాల్సి ఉండగా, ఐదు నెలల బకాయిలు కలిపి సుమారు రూ.41.28 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. సర్పంచులకే కాకుండా కొంతమంది ఉపసర్పంచులు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు కూడా నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.గ్రామాల్లో తాగునీటి సమస్యలు, పారిశుధ్య కార్యక్రమాల పర్యవేక్షణ, వీధి దీపాలు, అభివృద్ధి పనుల అమలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ గౌరవ వేతనాలు సకాలంలో అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది సర్పంచులు గ్రామ అవసరాల కోసం వ్యక్తిగతంగా అప్పులు చేసి ఖర్చు చేస్తున్న పరిస్థితి నెలకొన్నదని సమాచారం.మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 62 వేల మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కూడా గత రెండు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, వైద్య అవసరాలు, అప్పుల చెల్లింపులు వంటి బాధ్యతలు నిర్వహించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు. చిన్నారుల పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, గర్భిణులు మరియు బాలింతల సేవలలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ సిబ్బంది జీతాల ఆలస్యంతో మనోధైర్యం కోల్పోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇటీవల పలు ఉద్యోగ సంఘాలు, అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు వేతనాల ఆలస్యంపై ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు తెలిసింది. “ఒకటో తేదీ జీతాలు” అనే హామీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమేనా? గౌరవ వేతనాలు పొందే సిబ్బంది, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులకు వర్తించదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ప్రభుత్వం ప్రకటించిన హామీలకు అనుగుణంగా పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలు, జీతాలను వెంటనే విడుదల చేసి, ప్రతి నెలా క్రమం తప్పకుండా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సర్పంచులు, అంగన్వాడీ సిబ్బంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమయానికి జీతాలు అందక ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని, కనీస జీవన వ్యయాలు భరించడం కూడా కష్టమవుతోందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »