డప్పు బేరీలు, బోనాలు, భక్తి నినాదాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న గొల్లగూడెం జాతర
శ్రీ మల్లన్న స్వామికి భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ
నకిరేకల్, జూలై 1 (డిగ్నిటి న్యూస్): మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి, మేడలమ్మ, కేతమ్మ, ఎల్లమ్మ దేవతల జాతర ఉత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు సంప్రదాయ పద్ధతిలో బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా మహిళలు అలంకరించిన బోనాలను తలపై మోసుకుంటూ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు బేరీలు, గజ్జెల శబ్దాలు, భక్తి గీతాల నడుమ “ఓ లింగా.. ఓ లింగా..” అంటూ భక్తులు నినాదాలు చేస్తూ గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. జాతరను పురస్కరించుకుని పరిసర ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామ వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోగా, డప్పు బేరీల చప్పుళ్లతో గ్రామం మారుమోగింది. భక్తుల రాకతో జాతర ప్రాంగణం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి లక్ష్మి–సత్యనారాయణ దంపతులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యాదవ సంఘం నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

