రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

బనగానపల్లె, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి ప్రాణాలు వదిలిన విషాద సంఘటన బనగానపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానిక రైల్వే పోలీసుల కథనం ప్రకారం శనివారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా పట్టాలపైకి వచ్చి పడుకున్నాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన రైలు కింద పడటంతో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు, రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో, ఆసుపత్రిలోని విధి నిర్వహణలో ఉన్న వైద్యులు అతను మృతి చెందినట్లు ధృవీకరించారు.మృతుడి పేరు, ఊరు, ఇతర వివరాలేవీ ఇప్పటివరకు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభ్యం కాలేదని, దీనిపై అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించామని అధికారులు తెలిపారు. ఎవరైనా తమ పరిధిలో అదృశ్యమైన వ్యక్తుల వివరాలను సరిచూసుకోవాలని, మృతుడికి సంబంధించిన ఆనవాళ్లు తెలిసిన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం భద్రపరిచి, దర్యాప్తును ముమ్మరం చేశారు.

Translate »