
చిట్యాల, ఏప్రిల్ 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): నెల వ్యవధిలోనే రెండుసార్లు ప్రమాదాలు జరిగిన నోస్ట్ ఫార్మా ఫ్యాక్టరీ స్థితిగతులపై స్పెషల్ మెజిస్ట్రేట్తో విచారణ జరిపించి, యాజమాన్యంపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం చిట్యాల మండలం పిట్టంపల్లి పరిధిలోని సదరు కంపెనీ గేటు వద్ద ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ఇన్స్పెక్టర్లు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు యాజమాన్యాలకు తలొగ్గి ప్రమాదాల నివారణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో హెటెరో గ్రూపులోని పలు సంస్థల్లో ప్రమాదాలు జరిగినా కంటితుడుపు చర్యలతోనే సరిపెట్టారని ఆరోపించారు. ప్రమాదంలో మృతి చెందిన చినకాపర్తికి చెందిన బాలకృష్ణ గౌడ్ కుటుంబంతో పాటు, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మరో ఏడుగురు బాధితులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్పీఎస్ జిల్లా నాయకులు సామ రంగారెడ్డి, గాదె ఎల్లేష్, మారయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
