RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

వైయస్సార్ నగర్ లో గల టైలర్స్ కాలనీ సమస్యలు పరిష్కరించాలి

‘స్పందన’లో డిఆర్ఓకు కాలనీ మహిళల వినతి

https://dignitynews.in/wp-content/uploads/2026/06/1002088742.mp4

నంద్యాల, జూన్ 15 (డిగ్నిటి న్యూస్): నంద్యాల పట్టణ పరిధిలోని వైయస్సార్ నగర్ లో గల టైలర్స్ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు అధికారులను ఆశ్రయించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) రాము నాయక్ కు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

https://dignitynews.in/wp-content/uploads/2026/06/1002093252.mp4

ఈ సందర్భంగా కాలనీ మహిళా ప్రతినిధులు మాట్లాడుతూ.. వైయస్సార్ నగర్ లోని టైలర్స్ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు కనీసం రోడ్లు వేయలేదని, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరంతా రోడ్లపైనే నిలిచిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తీవ్ర దుర్వాసన వస్తోందని, దోమలు చేరి చిన్న పిల్లలు, వృద్ధులు అంటువ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన చెందారు.

https://dignitynews.in/wp-content/uploads/2026/06/1002093251.mp4

వర్షాలు వస్తే మురుగునీరు, వర్షపు నీరు కలిసి ఇళ్లలోకి వస్తోందని, కాలనీలో నడవడానికి కూడా వీల్లేకుండా పోతోందని వివరించారు. తాగునీటి సరఫరా కూడా సక్రమంగా లేదని, వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని డిఆర్ఓ దృష్టికి తీసుకువెళ్లారు.అనంతరం కాలనీకి చెందిన మరో మహిళా ప్రతినిధి మాట్లాడుతూ.. గత పది, పదిహేనేళ్లుగా తమ కాలనీ సమస్యలపై మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

https://dignitynews.in/wp-content/uploads/2026/06/1002093242.mp4

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు ఆ తర్వాత తమ మొహం చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సక్రమంగానే మున్సిపల్ పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ కాలనీలో పర్యటించి సమస్యలను స్వయంగా పరిశీలించాలని, శాశ్వత పరిష్కారం చూపి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాలనీ ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

https://dignitynews.in/wp-content/uploads/2026/06/1002093250.mp4

కాలనీకి చెందిన సీనియర్ మహిళా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. తమ కాలనీ సమస్యలపై స్థానిక కౌన్సిలర్ కు, మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడం వల్ల చిన్న పిల్లలు బడికి వెళ్లాలన్నా, వృద్ధులు బయటకు రావాలన్నా నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి తమ కాలనీని నరకకూపం నుండి రక్షించాలని, అంధకారంలో ఉన్న కాలనీకి వీధి దీపాలు వేయించి వెలుగులు నింపాలని కోరారు.సమస్యలపై సానుకూలంగా స్పందించిన డిఆర్ఓ రాము నాయక్, త్వరితగతిన మున్సిపల్ అధికారులతో మాట్లాడి టైలర్స్ కాలనీ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని కాలనీ మహిళలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version