– విషమంగా పరిస్థితి
కొండమల్లేపల్లి, జూన్ 15 (డిగ్నిటి న్యూస్): నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు ఎనిమిదో తరగతి విద్యార్థి రామ్ చరణ్ (13) చేత తోరణాలు కట్టించగా, విద్యుత్ ఘాతానికి గురై బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. నాంపల్లి మండలం బండ తిమ్మాపురం గ్రామానికి చెందిన ఈ విద్యార్థి కరెంటు షాక్ తగిలి కింద పడటంతో తలకు తీవ్ర గాయమైంది. బ్రెయిన్లో రక్తం గడ్డకట్టినట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే ఉపాధ్యాయులు బాలుడిని దేవరకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో ఆసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు, ఇంత పెద్ద ప్రమాదం జరిగినా స్థానిక ఎంఈఓ తనకు ఏమీ తెలియదని బాధ్యతారాహిత్యంగా సమాధానమివ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థి సంఘాలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
