RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

కార్పొరేట్ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి

  • జాయింట్ కలెక్టర్‌కు పీడీఎస్‌యూ వినతి

కర్నూలు, జూన్ 8 (డిగ్నిటి న్యూస్): ఐఐటీ, జేఈఈ మెయిన్స్, నీట్ పుస్తకాల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యా వ్యాపారానికి పాల్పడుతున్న కార్పొరేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ఆయన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ఇంటర్ బోర్డు నిబంధనలను బేఖాతరు చేస్తూ తల్లిదండ్రుల నుండి వేలాది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా ఐఐటీ, నీట్ శిక్షణ అంటూ తప్పుడు ప్రకటనలతో విద్యార్థులను మోసం చేస్తున్నారని, ఒకే బ్రాంచ్ అనుమతితో రెండు బ్రాంచ్‌లు నడుపుతున్నారని ధ్వజమెత్తారు. అరకొర వసతులతో లక్షల వ్యాపారం చేస్తున్న కళాశాలలపై విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా నాయకులు సోమశేఖర్, షాహీద్, మర్రిస్వామి, ఉరుకుందు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version