నందవరం, జూలై 24 (డిగ్నిటీ న్యూస్): ప్రముఖ పుణ్యక్షేత్రం నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జూలై 27 నుండి 29 వరకు వైభవంగా జరగనున్న శాకాంబరీ ఉత్సవాలకు రావాల్సిందిగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి, ఆయన సతీమణి ఇందిరా రెడ్డిలను ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎన్. శ్రీనివాస రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పి.వి. కుమార్ రెడ్డి, అర్చకులు, సిబ్బంది మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా శాకాంబరీ ఉత్సవాలతో పాటు జూలై 31న అమ్మవారి చీర-సారె కార్యక్రమం, ఆగస్టు 12న జయంతి వేడుకలు, ఆగస్టు 21న వరలక్ష్మి వ్రతం సందర్భంగా నిర్వహించే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలకు సైతం వారిని ఆహ్వానించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి సూచించారు.
